Ramayanam in one painting by Bapu

Ramayanam in one painting by Bapu

Sunday, December 4, 2011

బాలకాండ శ్లోకాలు: 56-60 (ప్రథమ సర్గ)

తం నిహత్య మహాబాహు: దదాహ స్వర్గతశ్చ స: |
స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణిం || (56)

వికృతమైన రూపం కలిగిన ఈ రాక్షసుడిని, అద్భుతమైన శక్తి గల రాముడు త్రుటిలో సంహరించెను. ఆ రాక్షసుడు, స్వర్గలోకాలకు వెడలిపోతూ, రామునితో ఇల చెప్పెను. " ఓ రామా, ఈ అరణ్యములోనే శబరి అనే ఒక గొప్ప తపస్విని ఉన్నది"   (56)

శ్రమణిం ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవ|
సోభ్యగచ్చన్ మహాతేజా: శబరీం శత్రుసూదన: || (57)

శబరి గురించి చెప్తూ, " ఆ మహా సాధ్వి, సత్య, దయా ధర్మాలకు కట్టుబడినదియై, నిత్యమూ దైవ స్మరణముతో గడిపే మహాత్మురాలు. ఓ రామా, నీవు ఆమె ఆశ్రమానికి వెళ్ళు" అని చెప్పి, కబంధుడు అద్రుశ్యమైయ్యెను. ఈ మాటలను విన్న రామచంద్రుడు, లక్ష్మణునితో కలిసి శబరి ఆశ్రమానికి బయలిదేరెను.   (57)

శబర్యా పూజితస్సమ్యక్ రామో దశరథాత్మజ: |
పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ || (58)

దశరధాత్మజుడైన రామచంద్రుని రాక చూసి, ఆయనని ఆహ్వానించి, అతిధి మర్యాదలు చేసెను. ఆ పంపా నది సమీపంలోనే రామునికి హనుమంతునితో పరిచయమయ్యెను. (58)

హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగత: |
సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబల: || (59)

హనుమంతుని ద్వారా రామ లక్ష్మణులకు సుగ్రీవునితో పరిచయమయ్యెను. రాముడు సుగ్రీవునికి, హనుమంతునికి తన గాధనంతా వర్ణించెను.  (59)

ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషత: |
సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానర: || (60)

మోదటినుంచీ జరిగినదంతా వివరిస్తూ, సీతాపహరణమును వివరంగా వర్ణించెను. రాముడు చెప్పినదంతా సుగ్రీవుడు శ్రద్ధ గా విని, రామునితో స్నేహమునకు అంగీకరించెను.  (60)

Monday, October 24, 2011

బాలకాండ శ్లోకాలు: 51-55 (ప్రథమ సర్గ)

న విరోధో బలవతా క్షమో రావణ తేన తే |
అనాదృత్య తు తద్వాక్యం రావణ: కాలచోదిత: ||  (51)

"ఓ రావణా, రామునితో వైరము నీకు అంత మంచిది కాదు. రాముని ధైర్య సాహసాలను తక్కువ అంచనావేసి నీ పతనాన్ని కొనితెచ్చుకోకు. నీ సహోదరి ఐన శూర్పణఖ మాటలు విని రామునితో యుద్ధానికి వెళ్ళిన మన పదునాలుగువేల మంది రాక్షసులను రాముడు అవలీలగా హతమార్చాడు. రామునితో వైరము నీకు కూడా అదే పరిస్థితిని తెచ్చిపెడుతుంది." ఇంతగా రావణాసురుడిని హెచ్చరించినా, మారిచుని మాటలను పెడచెవిన పెట్టాడు రావణాసురుడు.   (51)

జగామ సహమరీచ: తస్యాశ్రమపదం తదా |
తేన మాయావినా దూరం అపవాహ్య నృపాత్మజౌ ||  (52)

ఇలా రావణుడు, మారీచుని వెంట పెట్టుకుని రాముని ఆశ్రమానికి వెళ్ళెను. అక్కడ, రాజ కుమారులైన రామ లక్ష్మణులను, మారీచుని మాయచేత అడవిలోనికి పంపివేసెను.  (52)

జహార భార్యాం రామస్య
గృధ్రం హత్వా జటాయుషం |
గృధ్రం చ నిహతం దృష్ట్వా
హృతాం శ్రుత్వా చ మైథిలీం ||  (53)

రామ లక్ష్మణులను ఆశ్రమానికి దూరంగా పంపివేశాక, రావణాసురుడు సీతను అపహరించి తీసుకుపోతుండగా, జటాయు రావణాసురుని బారినుండి సీతను కాపాడుటకు ప్రయత్నించెను. ఆ ప్రయత్నంలో జటాయు తీవ్రంగా గాయపడెను. సీతను రావణాసురుడు అపహరించెనన్న వార్త రామచంద్రమూర్తి జటాయువు ద్వారా తెలుసుకొనెను. (53)

రఘవశ్శోకసంతప్తో విలలాపాకులేంద్రియ: |
తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం ||  (54)

సీతను రావణాసురుడు అపహరించెనన్న వార్త విని, రామచంద్రమూర్తి ఎంతో విలపించెను. తన ప్రాణానికి ప్రాణమైన భార్య తననుంచి దూరమైందన్న బాధతో రాముడు చాల విలపించెను. కొంత తేరుకున్న తరువాత, సీతను కాపాడుటకై ప్రయత్నించి తన ప్రాణాలను విడిచిపెట్టిన జటాయుకు రాముడు అంత్యక్రియలు చేసెను.  (54)

మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ|
కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం ||  (55)

జటాయువుకు అంత్యక్రియలు చేసిన పిమ్మట, రామ లక్ష్మణులు సీతను వెతుకుతూ అడవులలోకి వెళ్ళెను. ఇలా అడవులలో తిరుగుతుండగా ఒక ఘోరమైన రూపం కలిగిన కబంధుడనే రాక్షసుడిని రామ లక్ష్మణులు చూసెను.  (55)

Friday, August 19, 2011

బాలకాండ శ్లోకాలు: 46-50 (ప్రథమ సర్గ)

తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ |
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ ||  (46)

రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా, ఒకనాడు, జనస్థానంలో నివసించే కామరూపిణి ఐనటువంటి శూర్పణఖ అనబడే రాక్షసి, రాముడుని మోహించి వచ్చ్చినప్పుడు, తన తమ్ముడైన లక్ష్మణుడితో ఆ రాక్షసి ముక్కు, చెవులూ కోయించేసాడు శ్రీ రాముడు. (46)

తతశ్శూర్పణఖావాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ |
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం ||  (47)

శూర్పణఖకు ఇలా జరగగానే, తన అన్నలైన ఖర దూషణుల దెగ్గరకు వెళ్ళి, తనకు జరిగిన అవమానం గురించి చెప్పగా, వారు వారి దెగ్గర ఉన్న పదునాలుగువేల మంది రాక్షసులను రాముడిపైకి యుద్ధానికి పంపెను. (47)

నిజఘాన రణే రామ: తేషాం చైవ పదానుగాన్ |
వనే తస్మిన్ని వసతా జనస్థాన నివాసినాం ||   (48)

మొదటి పదునాలుగువేలమంది రాక్షసులను సమ్హరించిన రాముడు, తరువాత్ వరుసలో వచ్చిన ఖర, దూషణులను, వారి రాక్షస సైన్యంతో సహా రాముడు సమ్హరించెను.  (48)

రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ |
తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణ: క్రోధమూర్చిత: ||  (49)

రాముడు, జనస్థానములో ఉన్నంత కాలము, ఖర, దూషణులతో కలిపి మొత్తం పదునాలుగు వేల మంది రాక్షసులను సమ్హరించెను. తన జ్ఞాతులైన ఖర దూషణుల మరణ వార్త విన్న రావణాసురుడు క్రోధాగ్నితో రగిలిపోయాడు.  (49)

సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం |
వార్యమాణస్సుబహుశో మారీచేన స రావణ: ||   (50)

క్రోధము పూనిన రావణాసురుడు, తన జ్ఞాతుల మరణానికి కారణమైనటువంటి వారిపై పగ సాధించవలెనని, మారీచుడు అనే రాక్షసుని సహాయమునకు వెళ్ళగా, అతడు రాముడితో వైరము రావణుడికి మంచిది కాదు అని వారించెను.  (50)

Saturday, July 30, 2011

బాలకాండ శ్లోకాలు: 41-45 (ప్రథమ సర్గ)

ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవ లోచన: |
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ ||  (41)

దండకారణ్యములో ప్రవేశించిన తరువాత, విరాధుడు అనే రాక్షసుడిని రామచంద్రమూర్తి సంహరించారు. అటుపిమ్మట, రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై శరభంగ మహర్షి ఆశ్రమాన్ని దర్శించెను.   (41)

సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా |
అగస్త్య వచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం ||  (42)

సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి, అటు పిమ్మట అగస్త్య మహర్షి ఆశ్రమానికి, అగస్త్య మహర్షి తమ్ముడి ఆశ్రమానికి కూడా వారు వెళ్ళెను. అగస్త్య మహర్షి, ఇంద్రుడు ఇచ్చిన ధనుస్సును రాముడుకి ఇచ్చెను.  (42)

ఖడ్గం చ పరమప్రీత: తూణీ చాక్షయసాయకౌ |
వసతస్తస్య రామస్య వనే వనచరైస్సహ ||  (43)

ధనుస్సుతో పాటు ఒక ఖడ్గము, ధనుస్సు కొశం అక్షయ బాణ తూణీరాలను కూడ ఇచ్చెను. ఆ తూణీరములలో బాణములు ఎన్నటికీ తరగవు. ఇలా శరభంగ మహర్షి యొక్క ఆశ్రమ సమీపములో రాముడు నివసిస్తూ ఉండగా, అడవులలో నివసిస్తున్నవానప్రస్థులు రాముని వద్దకు వచ్చెను.   (43)

ఋషయో భ్యాగమమ్ సర్వే వధాయాసుర రక్షసాం |
స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ||  (44)

వానప్రస్థులు రాముడి వద్దకు చేరి, వనాల్లో తిరుగుతూ వారిని బాధిస్తున్న రాక్షసులను సంహరించమని కోరగా, ఏ ఏ వనాలు రాక్షసుల వల్ల బాధపడుతున్నయో ఆ ఆడవులలో ఉన్న రాక్షసులందరినీ సంహరించటానికి రాముడు అంగీకరించెను.   (44)

ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధస్సంయతి రక్షసాం |
ఋషీణామగ్నికల్పానాం దండకారణ్య వాసినాం ||  (45)

అలా అంగీకరించిన రాముడు, అడవులలో ఉండి తపస్సు చేసుకుంటున్న మహా మునులందరిని, ఎవరైతే అగ్ని వంటి తేజస్సు కలిగి ఉన్నారో, వారిని వారి తేజస్సుతో రాక్షసులను నిర్మూలించమని అడిగెను.   (45)

Saturday, July 23, 2011

బాలకాండ శ్లోకాలు: 36-40 (ప్రథమ సర్గ)

త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్ |
రామోపి పరమోదార: సుముఖస్సుమహాయశా: ||   (36)

సహజ దానగుణ శీలుడు, ఉదార స్వభావుడైన రాముడితో భరతుడు అడవులకు వచ్చి " రామా, ఈ రాజ్యానికి నువ్వొక్కడివే రాజువి. ఈ రాజ్యము దశరథ మాహారాజు గారి తరవాత నీకే చెందుతుంది" అని అన్నాడు.   (36)

న చైఛ్ఛత్పితురాదేశాత్ రాజ్యం రామో మహాబల: |
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పున: పున: ||  (37)

ఎంత బతిమిలాడినా, తన తండ్రి గారికి ఇచిన మాట కోసం రాజ్యాన్ని వొద్దు అను భరతునితో రాముడు చెప్పాడు. ఐనా భరతుడు రాజ్యాన్ని పాలించను అని అనగా, రాముడు, తన పాదుకలను భరతునకు ఇచి, వాటిని తన
స్థానం లో ఉంచమని చెప్పెను.   (37)

నివర్తయామాస తతో భరతం భరతాగ్రజ: |
స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ ||  (38)

సింహాసనం మీద పాదుకలను ఉంచి రామాజ్ఞగా రాజ్యాన్ని పాలించమని భరతునకు చెప్పెను. భరతుడు, తన కోరిక తీరనందుకు బాధపడి, రామ పాదుకలకు నమస్కరించి, వాటిని తన శిరస్సున ధరించి బయలుదేరెను.    (38)

నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయా |
గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియ: ||   (39)

భరతుడు, అడావులను వదిలి వెళ్ళి, అయోధ్యకు వెళ్ళకుండా నందిగ్రామములోనే నివసిస్తూ, రామ పాదుకలను రాజుగారి స్థానంలో ఉంచి, రామాజ్ఞగా రాజ్యాన్ని పాలిస్తూ, రాముడు ఎప్పుడు అయోధ్యకు తిరిగి వస్తాడో అని ఎదురుచూస్తూ ఉన్నాడు.   (39)

రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ |
తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశ హ ||  (40)

చిత్రకూటంలో రాముడు ఉన్న సంగతి భరతుడి వలన రాజ్యంలో ఉన్న ప్రజలకు తెలిస్తే అందరు తన ఆశ్రమానికి వచ్చేస్తారని గ్రహించి, వాళ్ళు రాకపోయినా భరతుడే మళ్ళీ రావొచ్చని, తన ఆశ్రమాన్ని మర్చుకోవాలను నిర్ణయించుకున్నాడు.    (40)

Saturday, July 16, 2011

బాలకాండ శ్లోకాలు: 31-35 (ప్రథమ సర్గ)

చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ |
రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయ: ||  (31)

ఈ ప్రయాణంలో భరద్వాజుని ఈశ్రమము చేరుకుని, ఆయన ఆజ్ఞచే చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు. ఆ పర్వతము మీద ఒక సుందరమైన కుటీరము లక్ష్మణుడు నిర్మించెను. అయోధ్యలో ఎంత ఆనందంగా ఉన్నారో, ఈ కుటీరంలో కూడా అంతే ఆనందంగా రాముడు, సీతా, లక్ష్మణుడు ఆ ఆశ్రమం లో గడిపారు.   (31)

దేవగంధర్వసంకాశాస్తత్ర తే న్యవసన్ నుఖం |
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా ||  (32)

అమితోత్సాహంతో ఆ ముగ్గురు, ఆనందంగా ఆ కుటీరంలో గడుపుతున్నారు. ఐతే రాముడు అడవులకు వెడలిపోయాడని దశరథ మహారాజు పుత్రశోకంలో మునిగిపోయాడు.    (32)

రాజా దశరథ: స్వర్గం జగామ విలపన్ సుతం |
మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజై: || (33)

తన ప్రియ పుత్రుడైన రాముడు అడవులకు వెల్లిపోయాడని విలపించి దశరథ మహారాజు దు:ఖంతో శరీరాన్ని విడిచిపెట్టేశారు. తండ్రి గారు వెళ్ళిపొగానే, అన్నగారైన రాముడు కూడా లేనందున, రాజ్య భారమును వశిష్ఠాది మహర్షులు తమ్ముడైన భరతునకు అప్పగించారు.     (33)

నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబల: |
స జగామ వనం వీరో రామపాదప్రసాదక: ||   (34)

భరతుడు, రాజ్యాన్ని పాలించడానికి తగిన సమర్ధత కలిగినవడైనప్పటికి, తన అగ్రజుడైన రాముడు లేని రాజ్యం తనకు అఖ్ఖరలేదు అని వశిశ్ఠాదులకు చెప్పి, అన్నగారైనటువంటి రాముడితో ఉండటానికి అడవులకు బయలుదేరాడు.   (34)

గత్వా తు స మాహాత్మానం రామం సత్యపరాక్రమం |
అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావపురస్కృత: ||   (35)

భరతుడు అడవులకు చేరుకుని, సత్యపరాక్రమవంతుడైన రాముడి పాదాలచెంత చేరి, ఇలా ప్రాధేయపడుతునాడు.    (35)

Friday, July 8, 2011

బాలకాండ శ్లోకాలు: 26-30 (ప్రథమ సర్గ)

భ్రాతరం దయితో భ్రాతు: సౌభ్రాత్రమనుదర్శయన్ |
రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా ||  (26)

ఒక తమ్ముడు, తన అన్న పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి, రాముడితోపాటు అడవులకు బయలుదేరిన లక్ష్మణుడు తన తల్లి ఐన సుమిత్ర కి ఆనందం కలిగించాడు. రాముడి ప్రియ భార్య ఐన సీత కూడా ఆయనతో అడవులకు బయలుదేరినది.(26)

జనకస్య కులే జాతా దేవమాయేన నిర్మితా |
సర్వలక్షణసంపన్నా నారీణాముత్తమా వధూ: ||  (27)

జనకుని వంశం లో పుట్టినది, దేవతలచేత సృష్టించబడినదా అన్నంత మెరిసిపోయేటి శరీరము కలది, ఆడవారికి ఉండవలసిన అన్ని ఉత్తమ లక్షణాలు కలిగినది, రాముడికి తగిన భార్య సీత.  (27)

సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా |
పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ ||    (28)

చంద్రుడిని అనుసరించేటటువంటి రోహిణి వలే, సీత రాముడితో అడవులకు బయలుదేరెను. వనవాసమునకు రాముడు బయలుదేరి వెడలుతుండగా, రాజ్య ప్రజలు, చివరకు తన రండ్రి ఐన దశరథ మాహారాజు కూడా వారివెనుక కొంత దూరం వెంట వెళ్ళెను.  (28)

శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ |
గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం ||  (29)

కొంతదూరం ప్రయాణం చేసాక, రాముడు, సీత, లక్ష్మణుడు, రథ సారథి ఐన సుమంత్రుడు, గంగా నది ఒడ్డున గల శృంగిబేరపురములో, రామ భక్తుడైనటువంటి గుహుని వద్దకు చేరుకున్నారు.   (29)

గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా |
తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకా: ||  (30)

గుహునితో కలుసుకొనిన రాముడు, సీత, లక్ష్మణుడు, దశరథ మహారాజు మంత్రి ఐనటువంటి సుమంత్రుడిని, రథాన్ని విదిచి, పదవలో నదిని, తరువాత వచ్చే ఎన్నో వనాలను దాటుటకు వెళ్ళెను.  (30)

Thursday, July 7, 2011

బాలకాండ శ్లోకాలు: 21-25 (ప్రథమ సర్గ)

యౌవరాజ్యేన సంయోక్తుమైచ్చత్ప్రీత్యా మహీమతి:  |
తస్యాభిషేకసంబారాన్ దృష్ట్వా భార్యాథ కైకయీ  ||    (21)

ఇటువంటి ఎన్నో మంచి లక్షణాలు కలిగిన శ్రీ రాముడికి, దశరథ మహారాజు యువరాజ పట్టాభుషేకం చేయాలని సంకల్పించి తగిన సంబారాలన్ని మొదలుపెట్టించాడు. ఇవి చూసిన దశరథుని చిన్న భార్య ఐన కైకేయి, దశరథుడు తనకొసగిన రెండు వరములు కోరెను.   (21)

పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత |
వనవాసం చ రామస్య భరతస్యాభిషేచనం ||    (22)

దశరథుడు పూర్వం తనకు ఒసగిన రెండు వరములను ఇప్పుడు కావాలని కోరినది. ఈ రెండు వరాలు ఏమనగా, పదునాలుగేళ్ళు రామ వనవాసము, కైకేయి పుత్రుడైన భరతునకు పట్టాభిషేకము.    (22)

స సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయుత: |
వివాసయామాస సుతం రామం దశరథ: ప్రియం ||   (23)

కైకేయికి ఇచ్చిన మాటకోసం, సత్యము, ధర్మము అనే బంధాలతో కట్టబడిన దశరథ మహారాజు, తన ప్రియాతి ప్రియమైన పెద్ద కొడుకైన రాముడిని అడవులకు పంపెను.    (23)

స జగామ వనం వీర: ప్రతిజ్ఞామనుపాలయన్ |
పితుర్వచననిర్దేశాత్ కైకేయ్యా: ప్రియకారణాత్ ||   (24)

తన తండ్రి కైకేయికి ఇచ్చిన మాట వ్యర్ధం కాకుండా ఉండటం కోసం, తన తండ్రికి అసత్యవాది అనే అపనింద రాకుండా ఉండటం కోసం, సవతి తల్లి ఐనా కన్న తల్లిని ప్రేమించినంతగా ప్రేమించిన కైకేయిని ఆనందింపజేయడం కోసం, బహు ధైర్యశాలి ఐన రాముడు అడవులకు వెడలెను.    (24)

తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మనోనుజగామ హ |
స్నేహాద్వినయసంపన్న: సుమిత్రానందవర్ధన: ||    (25)

రాముడి పట్ల తనకున్న సహజమైన భాతృప్రేమ వలన, అన్నగారి పట్ల మర్యాద వలన, రాముడి తమ్ముడైన లక్ష్మణుడు, తన అన్నగారి వెంట ఆనందముగా అడవులకు బయలుదేరెను.   (25)

Tuesday, July 5, 2011

బాలకాండ శ్లోకాలు: 16-20 (ప్రథమ సర్గ)

సర్వదాభిగతస్సద్భి: సముద్ర ఇవ సింధుభి: |
ఆర్యస్సర్వసమశ్చైవ సదైకప్రియదర్శన: ||    (16)

భూమి మీద ఉన్న నదులకు సముద్రము ఎల ఐతే సమాశ్రయముగా ఉన్నదో, అలాగే రాముడు కూడా మంచి వారికి, శరణు వేడే వారికి సర్వకాలములయందు ఆశ్రయముగా ఉంటాడు, అందరినీ సమానముగా చూసేటటువంటి అలవాటు కలిగిన వాడు, చూడగానే అందరినీ ఆకర్షించేటటువంటి అందం కలిగినవాడు.     (16)

స చ సర్వగుణోపేత: కౌసల్యానందవర్ధన: |
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ ||  (17)

ఏ పని చేసినా, తన తల్లి ఐన కౌసల్యా దేవి కి ఆనందాన్ని తెచ్చేవాడు, సముద్రము వలే విశాలమైన జ్ఞానము కలవాడు, ఆత్మ స్థైర్యంలో హిమాలయమువంటివాడు.     (17)

విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన: |
కాలాగ్నిసదృశ: క్రోధే ల్షమయా పృథివీసమ: ||   (18)

విష్ణువుతో సమానమైనటువంటి వీర్యం కలిగినటువంటి వాడు, పౌర్ణమి చంద్రుడి వలే అందమైన వర్చస్సు కలిగినవాడు, కాలాగ్నితో సమానమైనటువంటి క్రోధం కలిగినటువంటివాడు, కాని సహనంలో పృథివితో సమానమైనటువంటివాడు.     (18)

ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపర: |
తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం || (19)

దానగుణంలో, ఐశ్వర్యంలో స్వయంగా కుబేరునితో సమానమైనటువంటి వాడు. నిజాయితీలో, సాక్షాత్తు ధర్మస్వరూపం, ఇలాంటి సద్గుణాలు కలిగిన రాముడికి, సత్యమే అతిపెద్ద ఆయుధం.    (19)

జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతం |
ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతిప్రియకామ్యయా ||   (20)

అణువణువునా రాజ్య సంరక్షణ, ప్రజా క్షేమమే ధ్యేయముగా కలవాడు, దశరధునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడైన శ్రీ రఘురాముడు.    (20)

Saturday, July 2, 2011

బాలకాండ శ్లోకాలు : 11-15 (ప్రథమ సర్గ)

సమస్సమవిభక్తాంగ: స్నిగ్ధవర్ణ: ప్రతాపవాన్ |
పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ: ||     (11)

అతను మధ్యస్తమైన పొడవుతో ఉన్నవాడు, అన్ని అవయవములు సమముగా ఉన్నవాడు, దృఢమైన వక్షస్థలము కలవాడు, వెడల్పైన కన్నులు కలవాడు, శరీరమంతా మెరిసిపోతూ ఉంటుంది, ఇటు వంటి మహా గుణములు కలిగిన అతని శరీరము మహా తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది.     (11)

ధర్మజ్ఞస్సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రత: |
యశశ్వీ జ్ఞానసంపన్న: శుచిర్వశ్యస్సమాధిమాన్ ||     (12)

ధర్మాన్ని ఎన్నడూ అతిక్రమించనటువంటి వాడు, సత్యవాక్య పరిపాలకుడు, ఎల్లవేళలా రాజ్యమునందున్న ప్రజల సంక్షేమమే ముఖ్యోద్దేశముగా కలవాడు, రాజ్యం గురించి తీసుకు12)నే నిర్ణయాలలో అతిజాగ్రత్త తీసుకునే వాడు, రాజు, పేద అనే తారతమ్యం లేకుండా అందరినీ మర్యాదతో చూసేవాడు, ప్రవర్తనలో ఎటువంటి లోటు లేని వాడు, ఇంద్రియ నిగ్రహణ కలవాడు మరియు ఎటువంటి పనినైనా అవలీలగా సాధించగల సత్తా ఉన్నటువంటివాడు, ఇటువంటి అద్భుతమైన గుణాలు కలిగి ఉంటాడు అతడు.     (12)

ప్రజాపతిసమశ్శ్రీమాన్ ధాతా రిపునిషూదన: |
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ||    (13)

సాక్షాత్తు బ్రహ్మ తో సమానమైనటువంటి తేజస్సు, ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, రాక్షసులను సమ్మూలముగా నిర్మూలించేటటువంటి వాడు, రాజ్యం లోని సర్వ జీవులను పరిరక్షించడమే ముఖ్యోద్దేశముగా కలవాడు అలాగని ధర్మాన్ని విడిచిపెట్టినవాడు కాడు రాముడు. స్వకార్యమైనా, రాచకార్యమైనా ధర్మాన్ని అతిక్రమించకుండా సాధించగలిగిన సమర్ధత కలిగినవాడు. ఇలా ధర్మాన్ని తప్పకుండా ప్రవర్తించడమే దాన్ని పరిరక్షించడముతో సమానము.    (13)

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా |
వేదవేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠిత: ||   (14)

ఆయన తన ధర్మాన్ని అతిక్రమించకుండా, తన ప్రజలకు ఆదర్శం గా నిలిచి, వారికి కూడా ధర్మాన్ని అనుసరించే ప్రవర్తించాలని బోధించేవాడు. ఇలా అనుక్షణం ధర్మాన్ని రక్షిస్తూనే ఉంటాడు. అతను వేదవేదాంగాలు తెలిసినవాడు. ధనుర్వేదంలో అత్యంత ప్రావీణ్యత కలిగినటువంటి వాడు.

సర్వశాస్త్రార్థతత్వజ్ఞ: స్మృతిమాన్ ప్రతిభానవాన్ |
సర్వలోకప్రియస్సాధు: అదీనాత్మా విచక్షణ: ||  (15)

సర్వ శాస్త్రాలూ, వేదాలు తెలిసినటువంటివాడు, సర్వ జనులకూ ప్రీతిపాత్రుడు, రాజ్యంలో ఉన్న ప్రజలనందరినీ సమానముగా చూసేటటువంటివాడు, ఒకరిపట్ల పక్షపాతముతో ప్రవర్తించే అలవాటు లేనటువంటివాడు. ఎవరిదెగ్గర ఎంత మర్యాదతో ప్రవర్తించాలో తెలిసినటువంటివాడు.

Monday, June 27, 2011

బాలకాండ శ్లోకాలు: 1-10 (ప్రథమ సర్గ)

తప:స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం |
నారదం పరిపప్రఛ్ఛ వాల్మీకి: మునిపుంగవం ||    (1)

మహా తపస్వీ, గొప్ప తేజో వంతుడు, మహా జ్ఞానీ ఐన నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఇలా  ప్రశ్నిస్తున్నాడు. (1)

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||     (2)

ఈ ప్రపంచంలో సకల గుణధాముడు, సత్య వాక్య పరిపాలకుడు, కీర్తి ప్రతిష్ఠలు కలిగిన వాడు, వీరత్వము కలిగినవాడు ఎవరు?         (2)

చారిత్రేణ చ కో యుక్త: సర్వ భూతేషు కో హిత: |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||   (3)

మంచి ప్రవర్తన, అన్ని జీవుల పట్ల వాత్సల్యంతో ఉండేటటువంటి వాడు, అన్ని విషయములలోనూ ప్రవీణ్యత కలిగినవాడు, అన్ని పనులను చక్కబెట్టుటకు సామర్ధ్యం కలిగినవాడు, చూడగానే అందరినీ ఆకట్టుకొనే అందం కలిగినవాడు ఎవరు?  (3)

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయక: |
కస్యబిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ||    (4)

ఎవరైతే ఎటువంటి పరిస్థితిని ఎదురుకోవడానికైనా భయపడని వాడు, తన కోపాన్ని నిగ్రహించుకున్నవాడు, ఈర్ష అనేదే ఎరుగని వాడు, అద్భుతమైన తేజస్సు కలిగినవాడు, యుద్ధం లో పోరాడటానికి దేవతలు సైతం జంకుతారో, అతను ఎవరు?   (4)

ఏతదిఛ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే |
మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవంవిధం నరం ||     (5)

ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు కనుక మీకు ఇటువంటి వ్యక్తి ఈ ప్రపంచం లో ఎక్కడ ఉన్నారో తెలిసే ఉండాలి. దయచేసి నా కుతూహలాన్ని గ్రహించి ఈ వ్యక్తిని గురించి చెప్పండి.    (5)

శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచ: |
శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ ||   (6)

వాల్మీకి పలికిన ఈ మాటలను విన్న త్రికాలవేది ఐన నారద మహర్షి, "ఓ వాల్మీకి మహర్షి, మీరు చెప్పిన గుణాలు కలిగిన వ్యక్తి గురించి చెబుతాను. శ్రద్ధ గా వినండి."    (6)

బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణా:  |
మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తశ్శౄయతాం నర:  ||    (7)

ఓ వాల్మీకి మహర్షి, మీరు చెప్పిన గుణాలు గొప్ప గొప్ప చక్రవర్తులకు సైతం సాధ్యం కానివి. అలాంటిది ఇన్ని గుణాలు ఒక మానవుడిలో ఉండటం దుర్లభం. ఐనా..ఇలాంటి ఒక మనిషి గురించి నాకు తెలుసు. అతని గురించి నేను ఇప్పుడు వర్నిస్తాను. శ్రద్ధగా వినండి.     (7)

ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైశ్శృత:  |
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ  ||    (8)

ఇక్ష్వాకు వంశం లో ఆవిర్భవించిన అతను జనాలకు రాముడు గా తెలుసు. అతను, ఏ పనికైనా చాలా జాగ్రత్తతో నిర్ణయం తీసుకునేవాడు, ఎటువంటి పరిస్థితిని ఐనా సమర్ధవంతంగా, ధైర్యం తో ఎదుర్కోనేవాడు, గొప్ప తేజస్సు కలవాడు, చెడుని, చెడు చేసేవాళ్ళనీ, అదుపులో పెట్టగల సమర్ధత కలవాడు, ఇవి మాత్రమే కాక, తన ఇంద్రియాలని కూడా కట్టడి చేయగలడు.    (8)

బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణ:  |
విపులాంసో మహాబాహు: కంబుగ్రీవో మహాహను:  ||    (9)

అతను అన్ని విషయాలలోనూ చాలా ప్రవీణ్యత కలిగిన వాడు, గొప్ప జ్ఞాని, మంచి వాళ్లకు ఎప్పుడూ సహాయం చేయాలనే సంకల్పంతో ఉన్నవాడు, చెడ్డవాళ్ళని శిక్షించే వాడు. అతను ఆజానుబాహుడు. అతని కంఠం శంఖము వలె ఉండును. ఎత్తైన బుగ్గలు కలవాడు అతడు.    (9)

మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమ: |
ఆజానుబాహుస్సుశిరా: సులలాటస్సువిక్రమ:  || (10)

సింహం వక్షస్ఠలము వంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు, ఒత్తైన భుజములు కలిగినటువంటివాడు, అతను ఆజానుబాహుడు, బారుగా ఉండే విల్లు ఉన్నటువంటివాడు, శత్రువులను అదుపులో పెట్టినవాడు, గొప్ప చక్రవర్తి వంటి ఠీవీ కలిగినటువంటి వాడు, సింహము వంటి నడక కలిగినటువంటి వాడు అతను.     (10)